Banking Rules: కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుండగా, దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో పలు కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి.
ముఖ్యంగా యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలు, ఏటీఎం ఉచిత లావాదేవీలు, అదనపు ఛార్జీలు, డిజిటల్ చెల్లింపుల భద్రతపై పలు బ్యాంకులు కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. దీంతో ఖాతాదారులు ముందుగానే ఈ మార్పులను తెలుసుకోవడం అవసరం.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్(HADFC) సహా కొన్ని బ్యాంకులు ఇకపై యూపీఐ ద్వారా ఏటీఎంలో నగదు తీసుకునే లావాదేవీలను కూడా నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్లలో భాగంగా పరిగణించనున్నాయి. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కార్డు లేకుండా నగదు తీసుకున్నా, అది కూడా ఉచిత పరిమితిలోనే లెక్కలోకి వస్తుంది.
ఉచిత లావాదేవీల పరిమితి దాటితే ఒక్కో యూపీఐ క్యాష్ విత్డ్రాయల్పై రూ.23తో పాటు వర్తించే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab national bank) కొన్ని ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. ఇప్పటి వరకు రూ.1 లక్ష వరకు నగదు తీసుకునే వీలు ఉండగా, ఇకపై అది రూ.50 వేలకే పరిమితం కానుంది. పెద్ద మొత్తంలో నగదు తీసుకునే వారికి ఇది ప్రభావం చూపవచ్చు.
బంధన్ బ్యాంక్(Bandhan Bank) కూడా ఏటీఎం వినియోగంపై నిబంధనలు మార్చింది. సొంత ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3 ఉచిత లావాదేవీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తాయి.
ఇక డిజిటల్ చెల్లింపుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి ద్వంద్వ ధృవీకరణపై దృష్టి పెరిగింది. ఓటీపీతో పాటు పిన్, పాస్వర్డ్ లేదా బయోమెట్రిక్ వంటి అదనపు ధృవీకరణ విధానాలు మరింత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.
అయితే బ్యాంక్ యాప్లలో బ్యాలెన్స్ చెక్, నాన్-ఫైనాన్షియల్ సేవలపై ఛార్జీలు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. కాబట్టి వినియోగదారులు తమ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లేదా బ్రాంచ్ ద్వారా నిబంధనలు ఒకసారి తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.








