AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నెల నుంచి వేడి, ఉక్కపోత తీవ్రత మరింత పెరగనుందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మంగళవారం విడుదల చేసిన వేసవి సీజనల్ అవుట్లుక్లో ఈ వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలను మినహాయించి దాదాపు రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు సాధారణం కంటే ఎక్కువ రోజులు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది.
ఏప్రిల్ నెలలో కోస్తా ప్రాంతాల్లో వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎండలు మండిపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశమూ ఉందని ఐఎండీ తెలిపింది.
వాతావరణ మార్పుల ప్రభావంతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరి, పెసర, మినుము, కూరగాయల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉండగా, మామిడి, అరటి పంటల్లో పూత, పిందె రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఈ పరిస్థితుల్లో రైతులు పంటల వద్ద తగిన తేమ ఉండేలా తరచుగా నీటి తడులు ఇవ్వాలని ఐఎండీ సూచించింది. అలాగే పొటాషియం లేదా యాంటీ ట్రాన్స్పరెంట్లను ఆకులపై పిచికారీ చేయడం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు, నేడు రాష్ట్రంలోని 10 మండలాల్లో వడగాలుల హెచ్చరిక జారీ అయింది. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.








