Facial Recognition Attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరును మరింత పర్యవేక్షించేందుకు AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అటెండెన్స్ నమోదుకు ఫేస్ రికగ్నిషన్ ఆధారిత మొబైల్ అటెండెన్స్ యాప్ను తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో హాజరు ఈ యాప్ ద్వారానే నమోదు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కార్యాలయ సమయాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, ఆలస్యంగా హాజరు కావడం, గైర్హాజరు వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
ALSO READ:Kangana Ranaut: బీజేపీ విజయం… శివసేనపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు
అయితే ప్రస్తుతం రీ-సర్వే కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఇటీవల కొంతమంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడంపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రజలకు సేవలు సక్రమంగా అందకపోవడం, కార్యాలయాల్లో ఉద్యోగులు కనిపించకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
ప్రజలకు నేరుగా సేవలు అందించే సచివాలయ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడం, జవాబుదారీతనాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ ఫేస్ రికగ్నిషన్ ఆధారిత అటెండెన్స్ యాప్ అమలుతో గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
