Amarnath Yatra: హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జూలై 3న ప్రారంభమైన వార్షిక అమర్నాథ్ యాత్రకు రోజురోజుకూ స్పందన పెరుగుతుండగా, తొలి 11 రోజుల్లోనే యాత్రికుల సంఖ్య 2.75 లక్షలు దాటింది. ప్రస్తుత రద్దీని బట్టి చూస్తే మూడు లక్షల మంది భక్తులు దర్శనం పూర్తి చేసిన మైలురాయిని యాత్ర త్వరలోనే చేరుకునే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
యాత్రను నిరంతరంగా కొనసాగించేందుకు ప్రతిరోజూ కొత్త బ్యాచ్లను జమ్మూ నుంచి పంపిస్తున్నారు. మంగళవారం 5,335 మంది యాత్రికులతో కూడిన మరో బృందం కట్టుదిట్టమైన భద్రత మధ్య బయలుదేరింది. వీరిలో ఎక్కువ మంది పహల్గామ్ మార్గాన్ని ఎంచుకోగా, మిగిలిన వారు బల్తాల్ మార్గం ద్వారా పవిత్ర గుహకు చేరుకోనున్నారు. అధికారిక లెక్కల ప్రకారం సోమవారం ఒక్కరోజే 24 వేల మందికిపైగా భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు.
ఇదిలా ఉండగా, రాంబన్ జిల్లాలోని చందర్కోట్ సమీపంలో యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు బ్రేకులు పనిచేయక మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది స్వల్పంగా గాయపడగా, వైద్య బృందాలు వెంటనే చికిత్స అందించాయి. అనంతరం వారిని మరో వాహనంలో యాత్ర కొనసాగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా యాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా ముగియనున్న ఈ 57 రోజుల యాత్ర కోసం కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశాయి. యాత్రికుల సౌకర్యం, భద్రతకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి.








