వ్యసనాలకు బానిసలై చోరీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వారి వద్ద నుంచి 212 గ్రాముల బంగారం, రెండు కేజీల వెండి, ఒక టైటాన్ వాచ్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మే 5వ తారీఖున కొత్తపేట మండలం బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి అదే నెలలో 9వ తారీఖున తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం, వెండి వస్తువులు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వాడపాలెంలో దొంగతనానికి పాల్పడిన బండారు మణికంఠ, చింతపల్లి వెంకటరాజు అనే యువకులను అరెస్టు చేసినట్లు సిఐ విద్యాసాగర్ వెల్లడించారు. వారి వద్ద నుంచి సుమారు 13 లక్షల రూపాయల విలువైన 212 గ్రాముల బంగారం, రెండు కేజీలు వెండి, టైటాన్ వాచ్ ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ జి. సురేంద్ర, పోలీసు సిబ్బందిని విద్యాసాగర్ అభినందించారు.








