Telangana floods: మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల ప్రభావంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి ప్రస్తుతం 75,432 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 80.50 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 21.20 టీఎంసీల నీరు నిల్వ కాగా, దీని ద్వారా సుమారు 14.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఎస్సారెస్పీ దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా భారీగా వరద చేరుతోంది. కడెం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం కారణంగా అధికారులు 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ఎల్లంపల్లి వద్ద ఇన్ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది.
20.18 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 19.70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర మధ్యమానేరు జలాశయానికి ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగుతోంది. నంది పంప్హౌస్లో అదనపు మోటారు ప్రారంభించడంతో 15,750 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్కు ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ ద్వారా ఇదే పరిమాణంలో నీటిని మధ్యమానేరు జలాశయానికి తరలిస్తున్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లోనూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది.
మేడిగడ్డ బ్యారేజీ నుంచి 3.31 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, సమ్మక్క బ్యారేజీ వద్ద గోదావరిలోకి 9.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. టేకులగూడెం సమీపంలో వరద నీరు రహదారిపైకి రావడంతో హైదరాబాద్–భూపాలపట్నం జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.70 అడుగులకు చేరి 3.97 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదే సమయంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది.
జూరాల ప్రాజెక్టుకు 1.04 లక్షల క్యూసెక్కుల వరద చేరగా, శ్రీశైలం జలాశయానికి 1.12 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
ALSO READ: Ayodhya Ram Mandir Trust | రామమందిర ట్రస్ట్లో కీలక మార్పులు.. ఐఐటీ మాజీ విద్యార్థికి కీలక పదవి








