Heavy Rainfall: గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. కుండపోత వానల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రన్వేపై నీరు నిలిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు శుక్రవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో అహ్మదాబాద్లో ఏకంగా 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షం కారణంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు విమానాశ్రయ కార్యకలాపాలపై కూడా వర్ష ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రయాణికులు విమానాల సమయాలను ముందుగా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.








