తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ( Konda Surekha), స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి( Kadiyam Srihari) మధ్య కొనసాగుతున్న విభేదాలు మరో మలుపు తిరిగాయి. ఈ వ్యవహారాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లారు. తాజాగా ఆమెతో భేటీ అయిన సురేఖ, తనకు ఎదురవుతున్న ఇబ్బందులు, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, పదేపదే అనవసర వివాదాల్లో తన పేరును ప్రస్తావిస్తూ వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సురేఖ వివరించినట్లు తెలుస్తోంది. మంత్రి వివరించిన అంశాలను శ్రద్ధగా విన్న మీనాక్షి నటరాజన్, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించాలని సూచించినట్లు తెలిసింది. చిన్నచిన్న విభేదాలను మరింత పెద్ద సమస్యగా మార్చకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆమె సలహా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కడియం శ్రీహరితో నెలకొన్న విభేదాలపై కొండా సురేఖ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లను కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ను కూడా కలవడంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.








