బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) స్వదేశానికి తిరిగి వెళ్లే అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ప్రస్తుతం భారతదేశంలో ఉంటున్న హసీనా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ ఏడాదిలోపు బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ తమ వైఖరిని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి శామా ఒబేద్ ఇస్లాం మాట్లాడుతూ, షేక్ హసీనా దేశానికి తిరిగి వచ్చిన వెంటనే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఆమె స్వచ్ఛందంగా లొంగిపోయినా లేదా ఇతర మార్గాల్లో అధికారుల ఎదుట హాజరైనా చట్టం ప్రకారం చర్యలు తప్పవని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు. హసీనా విదేశాల్లో ఉంటూ చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. అవామీ లీగ్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రభుత్వం అలాంటి రాజకీయ ప్రకటనలకు ప్రాధాన్యం ఇవ్వదని స్పష్టం చేశారు.
2024లో బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో షేక్ హసీనా భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె భారతదేశంలోనే ఉంటున్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లే అంశంపై ఆమె చేసిన తాజా ప్రకటనతో మరోసారి బంగ్లాదేశ్ రాజకీయాల్లో చర్చ మొదలైంది. అయితే ఆమె భవిష్యత్ నిర్ణయంపై అధికారిక స్పష్టత ఇంకా వెలువడాల్సి ఉంది.








