గతంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) తాజాగా తన వైఖరిలో మార్పు వచ్చినట్లు స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమవుతానని ఎప్పుడూ చెప్పలేదని, కేవలం సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయానికే పరిమితంగా తన వ్యాఖ్యలు ఉన్నాయని వెల్లడించారు.
శనివారం మీడియాతో అనౌపచారికంగా మాట్లాడిన ఆయన, సంగారెడ్డి నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అయితే తన భార్య నిర్మల కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉందన్నారు. అదే పరిస్థితిలో తాను మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు. తాను ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలనే అంశాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, నాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయాలని సూచించినా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే సిద్ధిపేట నియోజకవర్గంలో హరీశ్ రావుకు ప్రత్యర్థిగా నిలబడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత ప్రకటనలకు భిన్నంగా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఆయన ప్రస్తావించడంతో కాంగ్రెస్ వర్గాల్లోనూ, రాజకీయ విశ్లేషకులలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
ALSO READ: FIFA World Cup | చివరి క్షణాల్లో గోల్.. స్పెయిన్కు సెమీస్ బెర్త్, సెమీఫైనల్లో ఫ్రాన్స్తో పోరు








