Tirumala Alipiri Footpath: తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులను ఓ చిరుత ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది. అలిపిరి నడకమార్గంలో గాలిగోపురం దాటిన ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించడంతో అక్కడ ఉన్న భక్తులు అప్రమత్తమయ్యారు. చిరుతను గమనించిన కొందరు పెద్దగా కేకలు వేయడంతో క్షణాల్లోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అనూహ్యంగా ఎదురైన ఈ ఘటనతో కొంతమంది భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే, భక్తుల రద్దీ, అరుపుల కారణంగా చిరుత అక్కడ ఎక్కువసేపు నిలవకుండా సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగలేదు. ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ నెట్టింట విస్తృతంగా ప్రచారం అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, టీటీడీ భద్రతా సిబ్బంది వెంటనే నడకమార్గంలో గస్తీని పెంచి పరిస్థితిని సమీక్షించారు. భక్తుల భద్రతకు అవసరమైన అదనపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమల నడకమార్గంలో వన్యప్రాణులు కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చిరుతల సంచారం కారణంగా పలుమార్లు భక్తుల్లో భయం నెలకొంది. అటవీశాఖ అప్రమత్తమై నడకమార్గం పరిసరాల్లో బోన్లు ఏర్పాటు చేసి పలుచిరుతలను సురక్షితంగా పట్టుకుంది. అలాగే టీటీడీ భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా ప్రయాణించాలని, చిన్నారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే చేతిలో కర్రలు తీసుకుని నడవాలని సూచించింది. తాజా ఘటన నేపథ్యంలో మరోసారి అప్రమత్తంగా ఉండాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.








