Telangana Weather: తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాల జోరు తగ్గిపోవడంతో పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో చల్లటి వాతావరణం నెలకొనాల్సి ఉన్నప్పటికీ, ఈసారి అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పలుచోట్ల వేడి తీవ్రత కనిపిస్తోంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే హాట్స్పాట్గా నిలిచింది. నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో కూడా సాధారణ స్థాయిని మించి ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కపోతను ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు అరుదుగా కనిపిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి కర్ణాటక సమీప అరేబియా సముద్ర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుండటంతో శనివారం, ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. దీంతో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో అత్యధికంగా 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లాలోని కామారెడ్డిగూడెం, వేములపల్లి ప్రాంతాల్లోనూ మంచి వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లాలోని మరికొన్ని గ్రామాల్లో కూడా చిరుజల్లులు పడటంతో స్థానికులకు కొంత ఉపశమనం లభించింది. రానున్న రెండు రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్వే.. రేవంత్ రెడ్డి ధీమా








