Niranjan Passes Away: అరుదైన జన్యుపరమైన న్యూరోమస్క్యులర్ వ్యాధితో పోరాడుతున్న హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ ఇక లేరు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
హనుమకొండ హనుమాన్ నగర్కు చెందిన నిరంజన్ చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. అనారోగ్యంతో మంచానికే పరిమితమైనప్పటికీ తన అభిమానాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. తన జీవితంలో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ను కలవాలన్న అతని కోరిక ఇటీవల నెరవేరింది. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లి అతనిని పరామర్శించడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
ఆ సందర్భంగా నిరంజన్ మంచం పక్కనే కూర్చుని అతడిని ఆప్యాయంగా హత్తుకున్న పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు. గతంలో పవన్ పాటలకు నిరంజన్ చేసిన డ్యాన్స్ వీడియోలను చూసి అభినందించారు. “చోటా గబ్బర్ సింగ్” అని అందరూ పిలుస్తారని నిరంజన్ చెప్పగా పవన్ చిరునవ్వుతో స్పందించారు. భవిష్యత్తులో కలిసి సినిమా చూడాలని, అవకాశం వస్తే తన సినిమాలో ప్రత్యేక అతిథిగా ఉంచుతానని ప్రేమగా హామీ ఇచ్చారు. అలాగే తిరుమల శ్రీవారి ప్రసాదాలు, పలు బహుమతులు అందించి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. అయితే ఆ ఆప్యాయ భేటీ జరిగిన కొద్ది రోజులకే నిరంజన్ మరణించడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. అతని మృతితో హనుమకొండలో విషాద వాతావరణం నెలకొనగా, సోషల్ మీడియాలో అభిమానులు నివాళులు అర్పిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.








