E25 petrol: దేశవ్యాప్తంగా 25 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్(E25 petrol)ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం ఈ25 పెట్రోల్ను అమల్లోకి తీసుకురావాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో, ఇతర వర్గాల్లో జరుగుతున్న ప్రచారం కారణంగా వాహనదారుల్లో నెలకొన్న సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది.
ఈ25 ఇంధనాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్రం తెలిపింది. వివిధ రకాల వాహనాల ఇంజిన్లపై అధిక శాతం ఇథనాల్ మిశ్రమం ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రస్తుతం పరిశీలనలు, పరీక్షలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. నిపుణుల నివేదికలు, సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం పూర్తయిన తర్వాతే భవిష్యత్ నిర్ణయం ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ఈ20 పెట్రోల్ సురక్షితమైనదేనని, వాహనాల పనితీరుపై ప్రతికూల ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, దేశీయ వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడం వంటి లక్ష్యాలతో ఇథనాల్ కలిపిన ఇంధన కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తోంది.
ఇప్పటికే భారత్ ఈ20 ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని నిర్ణీత సమయానికి ముందుగానే సాధించింది. అయితే ఈ20 వాడకంతో మైలేజీ తగ్గుతుందా, పాత వాహనాలపై ప్రభావం ఉంటుందా అనే సందేహాలు కొంతమంది వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ25పై వచ్చిన వార్తలు మరింత చర్చకు దారితీశాయి.
ఇటీవల ఈ22 నుంచి ఈ30 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు సంబంధించి పన్ను ప్రయోజనాల నిర్ణయాలు తీసుకోవడంతో ఈ25 త్వరలోనే అమలవుతుందనే ఊహాగానాలు పెరిగాయి. అయితే ఈ20 తర్వాత తీసుకునే ప్రతి నిర్ణయం దశలవారీగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. వాహన తయారీ సంస్థలు, నిపుణుల సూచనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. ధృవీకరించని సమాచారాన్ని నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది.








