Mobile Anganwadi: నేటి చిన్నారులే రేపటి దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములని, వారి అభివృద్ధిపై పెట్టే పెట్టుబడే రాష్ట్ర పురోగతికి మార్గం చూపుతుందని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ–2047 లక్ష్య సాధనలో నేటి బాలల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్న ఆమె, ప్రతి చిన్నారికి ప్రభుత్వ సంక్షేమ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లోని చిన్నారులకు కూడా పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య వంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ(Mobile Anganwadi) కేంద్రాలను ప్రారంభించింది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కార్మిక శాఖ మంత్రి వివేక్తో కలిసి మంత్రి సీతక్క మొబైల్ అంగన్వాడీ వాహనాన్ని ప్రారంభించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో ఈ మొబైల్ అంగన్వాడీ వాహనం సేవలు అందించనుంది. ముఖ్యంగా నగరాలకు వలస వచ్చే కార్మిక కుటుంబాల పిల్లలు అంగన్వాడీ సేవలకు దూరం కాకుండా ఈ విధానం ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. సాధారణ అంగన్వాడీ కేంద్రాల్లో అందించే అన్ని సేవలు మొబైల్ కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంటాయని సీతక్క వెల్లడించారు. పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలు, ఎదుగుదల పరిశీలన, ప్రీ-స్కూల్ విద్యతో పాటు తల్లి, శిశు సంక్షేమ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని చెప్పారు.
ఒక్క మొబైల్ అంగన్వాడీ వాహనం సుమారు పది అంగన్వాడీ కేంద్రాలకు సమానంగా సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంటుందని, దాదాపు 300 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓజా, ఇతర ఉన్నతాధికారులు, కార్మిక శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాలు, వలస కార్మికుల నివాస ప్రాంతాల్లోని చిన్నారులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.








