Indian Government: సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (MeitY), ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ ఎలా కనిపిస్తోందనే అంశంపై మెటా సంస్థను వివరణ కోరింది.
ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్, అలాంటి పోస్టులకు ప్రచార ప్రకటనలు (Ads) కనిపిస్తున్నాయనే ఆరోపణలు రావడంతో కేంద్రం స్పందించింది. ఈ తరహా కంటెంట్ను గుర్తించి తొలగించేందుకు సంస్థ వద్ద ఉన్న భద్రతా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని నోటీసులో కోరినట్లు సమాచారం.
కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాల మేరకు అధికారులు ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ వేదికలపై చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు కేంద్రం జారీ చేసిన నోటీసులకు మెటా సంస్థ ఎలా స్పందిస్తుంది? ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ పర్యవేక్షణ విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురానుంది? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యవహారంపై మెటా అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.








