India Defence: దేశ భద్రతను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో రక్షణ రంగంలో భారీ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రక్షణ రంగంలో సాంకేతిక సామర్థ్యాలను పెంచేందుకు దాదాపు రూ.52 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆమోదం పొందిన ప్రతిపాదనల్లో భూసేన కోసం యాంటీ డ్రోన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, ట్యాంకులను రక్షించే ఆధునిక వ్యవస్థలు, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థలు, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, జెట్ ఆధారిత కమికాజే డ్రోన్లు ఉన్నాయి. ఇవి భవిష్యత్ యుద్ధ పరిస్థితుల్లో సైన్యానికి మరింత వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందించనున్నాయి.
భారత నౌకాదళానికి కూడా కీలక సాంకేతిక పరికరాల కొనుగోలుకు అనుమతి లభించింది. సముద్ర భద్రతను బలోపేతం చేసే మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్, నౌకల నుంచి ప్రయోగించే మానవరహిత వైమానిక వ్యవస్థలు, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెస్టింగ్ సదుపాయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ద్వారా సముద్ర సరిహద్దుల్లో నిఘా, శత్రు కదలికలపై పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా సాగనుంది.
వాయుసేన సామర్థ్యాలను పెంచేందుకు హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ ప్లాట్ఫామ్ల కొనుగోలుకు కూడా ఆమోదం లభించింది. ఇవి దీర్ఘకాలిక నిఘా, ఇంటెలిజెన్స్ సేకరణ, కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ కొనుగోళ్లతో త్రివిధ దళాల సమన్వయం, సరిహద్దు భద్రత, ఆధునిక యుద్ధ సన్నద్ధత మరింత బలోపేతం అవుతుందని రక్షణ శాఖ వెల్లడించింది.








