AP EAPCET 2026 Results: ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET–2026 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించనున్నారు. ఫలితాల విడుదలకు సంబంధించి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన జేఎన్టీయూ కాకినాడ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈ ఏడాది AP EAPCET పరీక్షలకు మొత్తం 3.29 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మే 12 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించగా, వాస్తవానికి జూన్ ప్రారంభంలోనే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, సీబీఎస్ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఫలితాల ప్రకటనను వాయిదా వేశారు. అన్ని ప్రక్రియలు పూర్తవడంతో నేడు ఫలితాలను ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు.
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో(https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx) తమ హాల్ టికెట్ నంబర్, అవసరమైన వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డు, స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదనంగా ప్రభుత్వం అందుబాటులో ఉంచిన Mana Mitra WhatsApp సేవ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు.
కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలని అధికారులు సూచించారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నత విద్యామండలి త్వరలో ప్రకటించనుంది.








