Rythu Bharosa: తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు భరోసా’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించే రైతు ఆశీర్వాద సభలో పాల్గొని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.
మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 41.37 లక్షల మంది రైతులకు మొత్తం రూ.2,482.02 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇందులో ఒక ఎకరం వరకు సాగుభూమి ఉన్న 14.65 లక్షల మంది రైతులకు రూ.878.94 కోట్లు, రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతులకు రూ.1,603.08 కోట్లు జమ చేయనున్నారు. ఖరీఫ్ సీజన్లో మొత్తం 73.32 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులను దశలవారీగా పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఇటీవల కొత్త పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతులు జూలై 5లోపు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను సమీప వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పిస్తే, చివరి విడతలో వారికి కూడా పెట్టుబడి సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం చింతకాని మండలం జగన్నాథపురానికి వేదికను మార్చినా, ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో సభా ప్రాంగణం నీటమునిగింది. దీంతో కార్యక్రమాన్ని హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు సమీప రైతు వేదికలకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల నుంచి సుమారు 2,500 మంది రైతులు ప్రత్యక్షంగా సభకు హాజరుకానున్నారు.
Rythu Bharosa | నేడు రైతు భరోసా నిధుల విడుదల.. 41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లు
-








