Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల నిమిత్తం ముంబై చేరుకున్నారు. గత కొంతకాలంగా భుజాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన, నిపుణుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.
వైద్యుల సమాచారం మేరకు పవన్ కళ్యాణ్కు రెండు భుజాల్లో రొటేటర్ కఫ్కు గాయం కావడంతో పాటు కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో భుజాల కదలికలో అసౌకర్యం ఏర్పడడంతో మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిని ఆశ్రయించనున్నారు. ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ నిపుణుల బృందం పవన్ కళ్యాణ్కు పలు వైద్య పరీక్షలు నిర్వహించి, గాయాల తీవ్రతను అంచనా వేయనుంది. ఆ పరీక్షల అనంతరం అవసరమైన చికిత్స విధానంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా ఉన్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వైద్యుల సూచనల మేరకు చికిత్స కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుస ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకునేందుకు ముంబై వెళ్లారు. ఆయన ఆరోగ్యంపై అభిమానులు, పార్టీ శ్రేణులు ఆరా తీస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.








