Nitin Nabin: జీవితం అంటే కేవలం వేగంగా లక్ష్యాన్ని చేరుకునే పందెం కాదని, అది మన ఓపికను, సహనాన్ని పరీక్షించే ఒక ప్రయాణమని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని వీబీఐటీ క్యాంపస్లో నిర్వహించిన వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లెవ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానాలు ఇచ్చారు. రాజకీయ జీవితంలో ఎదురైన సవాళ్లు, వ్యక్తిగత అనుభవాలను ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. చిన్న వయసులోనే అనుకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశించానని ఆయన తెలిపారు. ఆ సమయంలో తన భవిష్యత్తుపై అనిశ్చితి, గందరగోళం ఉన్నప్పటికీ, అప్పగించిన ప్రతి పనిని నిబద్ధతతో పూర్తి చేయడమే తన బలంగా మారిందని చెప్పారు. చేసే పనిలో తన ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగినట్లు వివరించారు.
నేటి యువత త్వరగా విజయాలను సాధించాలనే ఆతృతలో ఉంటోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఏ రంగంలోనైనా విజయానికి వేగం కంటే ఓపిక, నిలకడ, క్రమశిక్షణ ముఖ్యమని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. నిరంతర ప్రయత్నం ద్వారానే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన విద్యార్థులకు సూచించారు.








