Pakistan Airstrikes: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్కు సంబంధించిన కీలక వివరాలను ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. సరిహద్దు సమీపంలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన వైమానిక దాడుల్లో తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కు(TTP militants) చెందిన 29 మంది మృతిచెందినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.
పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ ప్రకారం, ఇటీవల దేశంలో భద్రతా బలగాలపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్లు భావించిన రహస్య స్థావరాలు, శిక్షణ కేంద్రాలనే ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కరాచీలోని పారామిలిటరీ రేంజర్స్ ప్రాంతీయ కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు దుండగులు హతమవగా, మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తర్వాత ఈ దాడికి టీటీపీ అనుబంధ సంస్థ జమాత్-ఉల్-అహ్రార్ బాధ్యత వహించినట్లు ప్రకటించింది. ఈ పరిణామాల అనంతరం పాకిస్థాన్ సైన్యం సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. వైమానిక దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొన్నప్పటికీ, దీనిపై స్వతంత్రంగా నిర్ధారణ వెలువడలేదు. ఈ సైనిక చర్యతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరింత ప్రభావితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సరిహద్దు భద్రత, ఉగ్రవాద కార్యకలాపాల అంశాలపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాంతీయ భద్రతాపరమైన చర్చలకు దారితీసింది.
Pakistan Airstrikes | పాక్-అఫ్గాన్ సరిహద్దులో ఉద్రిక్తత.. టీటీపీ స్థావరాలపై వైమానిక దాడులు
-








