TTD: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు భారీ విరాళలు అందజేస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త అయిన నీరా రాడియా ఆ ఏడుకొండల స్వామికి భారీ విరాళాన్ని సమర్పించుకున్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా దాదాపు రూ.1.13 కోట్ల విలువైన ఆధునిక ఎలక్ట్రిక్ బస్సును ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) కానుకగా ఇచ్చారు.
దీంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నిర్వహణ కోసం సుమారు రూ.20 లక్షల విలువైన 15 యాపిల్ ట్యాబ్లను కూడా టీటీడీకి అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట ఈవీ బస్సుకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాత నీరా రాడియా బస్సు తాళాలు, యాపిల్ ట్యాబ్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా అధికారులు కొత్త బస్సులో ప్రయాణించి దాని సౌకర్యాలను పరిశీలించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు మెరుగైన రవాణా సేవలు అందించడానికి, పర్యావరణ పరిరక్షణకు ఈవీ బస్సులు కీలకంగా మారుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ‘ధర్మరథం’ సేవలో ఉన్న 20 బస్సుల్లో 14 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ బస్సులు 21 బస్ స్టాప్ల మీదుగా రోజుకు సుమారు 380 ట్రిప్పులు నిర్వహిస్తూ భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో పూర్తిగా డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
అదే సమయంలో ఆదివారం మాస పౌర్ణమి సందర్భంగా శ్రీవారి గరుడ సేవ నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.








