Praggnanandhaa: కార్ల్సన్పై మరోసారి ప్రజ్ఞానంద పైచేయి సాధించాడు. నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద తన అద్భుత ఆటతీరుతో చెస్ ప్రపంచాన్ని ఆకర్షించాడు.చెస్ లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించి ఆయన సంచలనం సృష్టించాడు.
నిన్న జరిగిన మూడో రౌండ్లో ప్రజ్ఞానంద 1-0 తేడాతో కార్ల్సన్పై చిరస్మరణీయ విజయం సాధించాడు. క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్సన్పై ఇది అతనికి రెండో గెలుపు కావడం విశేషం. గత సంవత్సరం ఇదే టోర్నీలో కూడా ప్రజ్ఞానంద కార్ల్సన్ను ఓడించిన విషయం తెలిసిందే.
గేమ్ ప్రారంభం నుంచే పక్కా వ్యూహంతో ఆడిన ప్రజ్ఞానంద, కార్ల్సన్కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను తనవైపు తిప్పుకున్నాడు. మరో మ్యాచ్లో భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అలీరెజా ఫిరాజా చేతిలో ఓటమి పాలయ్యాడు.
క్లాసికల్ గేమ్ డ్రా అయిన తర్వాత జరిగిన అర్మాగెడాన్ పోరులో గుకేశ్ పరాజయం చెందాడు. మూడు రౌండ్లు ముగిసే సరికి అలీరెజా 7.5 పాయింట్లతో, ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో టాప్ స్థానాల్లో కొనసాగుతున్నారు.
మహిళల విభాగంలో భారత యువ గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. కజకిస్థాన్ ప్లేయర్ బిబిసారా అసబయెవాపై గెలిచి ఆమె హ్యాట్రిక్ నమోదు చేసింది. మరోవైపు సీనియర్ ప్లేయర్ కోనేరు హంపి ఉక్రెయిన్కు చెందిన అన్నా ముజుచుక్ చేతిలో ఓటమి పాలైంది. ప్రస్తుతం అసబయెవా 5.5 పాయింట్లతో, దివ్య దేశ్ముఖ్ 4.5 పాయింట్లతో టాప్ స్థానాల్లో ఉన్నారు.








