అమెరికాలో ఉద్యోగ అవకాశాలపై ఆధారపడిన భారతీయ ఐటీ నిపుణులకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. హెచ్1బీ వీసా(H1B visa) నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ రిపబ్లికన్ పార్టీ ఎంపీ ఎలీ క్రీన్ ప్రవేశపెట్టిన “ఎండ్ హెచ్1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026”(New US bill proposes strict H1B visa rules) బిల్లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ కొత్త బిల్లు ప్రకారం హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ను ప్రారంభంలో మూడేళ్లపాటు పూర్తిగా నిలిపివేయాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత మాత్రమే మళ్లీ పునరుద్ధరించనున్నారు. ప్రస్తుతం ఉన్న 65 వేల వార్షిక వీసాల కోటాను కేవలం 25 వేలకే తగ్గించే అవకాశం ఉంది. అలాగే లాటరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, అత్యధిక వేతనం పొందే ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చే “వేజ్ బేస్డ్ సెలెక్షన్” విధానాన్ని అమలు చేయనున్నారు.
విదేశీ ఉద్యోగులను తక్కువ వేతనాలకు నియమించుకుంటున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో, హెచ్1బీ ఉద్యోగులకు కనీసం $200,000 (సుమారు రూ.1.67 కోట్లు) వార్షిక వేతనం తప్పనిసరి చేయాలని బిల్లు సూచిస్తోంది. దీంతో మధ్యస్థాయి ఐటీ నిపుణులకు అమెరికాలో అవకాశాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ఇంకా ఈ బిల్లు ప్రకారం థర్డ్ పార్టీ సంస్థల ద్వారా ఉద్యోగాలు ఇవ్వడాన్ని నిషేధించనున్నారు. అలాగే హెచ్1బీ వీసాదారులు తమ కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకురావడాన్ని కూడా పరిమితం చేసే అవకాశం ఉంది.
అంతేకాకుండా అంతర్జాతీయ విద్యార్థులకు కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానాన్ని కూడా రద్దు చేసే ప్రతిపాదన ఉంది. హెచ్1బీ వీసా ఉన్నవారు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా పరిమితం చేయనున్నారు. వీసా మార్పులు చేయాలంటే అభ్యర్థులు అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తుంది.
ప్రస్తుతం హెచ్1బీ వీసాల్లో సుమారు 70 శాతం భారతీయులకే లభిస్తున్నాయి. దాదాపు 2.8 లక్షల మంది భారతీయులు ఈ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నారు. గూగుల్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా భారతీయ నిపుణులపై ఆధారపడుతున్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే లక్షలాది భారతీయుల అమెరికా ఉద్యోగ కలకు గండి పడే అవకాశం ఉంది.
ఇప్పటికే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్1బీ వీసా జారీలు 25 శాతం తగ్గాయి. వీసా ఫీజులు పెరగడం, సోషల్ మీడియా వెరిఫికేషన్ కఠినతరం కావడం వంటి చర్యలతో భారతీయులపై ప్రభావం మరింత పెరిగింది. ఇప్పుడు కొత్త బిల్లు ఆందోళనలను మరింత పెంచుతోంది.








