AP 10th Class Results: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ఏప్రిల్ 3తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా, మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది ఉన్నారు.
పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6న ప్రారంభమై, ఏప్రిల్ 15తో పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో ఉపాధ్యాయులు, ఎస్వోలు, సీఎస్లు, క్యాంప్ ఆఫీసర్లు మూల్యాంకన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ ఏడాది మార్కుల ఖచ్చితత్వం కోసం ట్యాబ్ల ద్వారా డిజిటల్ ఎంట్రీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ప్రారంభంలో సాంకేతిక సమస్యల వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ, తర్వాత సమస్యలు పరిష్కరించి ప్రక్రియను వేగవంతం చేశారు.
ప్రస్తుతం మార్కుల ప్రాసెసింగ్ పనులు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తయితే మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది ఫలితాలు ఏప్రిల్ 23న విడుదలైన విషయం తెలిసిందే.
ఇక తెలంగాణలో కూడా 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13తో ముగిశాయి. అక్కడ 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
మూల్యాంకనం ప్రారంభమై, మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులు ప్రస్తుతం ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.








