అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తుచేసి టీమ్ ఇండియా ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఈ ప్రతిష్టాత్మక పోరులో భారత్ 96 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించి వరుసగా రెండోసారి కప్ను నిలబెట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో సంజూ శాంసన్ (89), ఇషాన్ కిషన్ (54), అభిషేక్ శర్మ (52) మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం 256 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ నిలవలేకపోయింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ఈ చారిత్రాత్మక విజయంతో సొంతగడ్డపై భారత ఆటగాళ్లు, లక్షలాది అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.





