Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం నేరేడుచర్ల, హుజూర్నగర్, మంథని, నారాయణఖేడ్, బిచ్కుంద, ఎల్లారెడ్డి, భీంగల్, ధర్మపురి వంటి పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది.
నారాయణఖేడ్లో 15 వార్డుల్లో 11 గెలిచి కాంగ్రెస్ ఆధిపత్యం చాటింది. మంథనిలో 13లో 11 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. బిచ్కుంద, ఎల్లారెడ్డిలో 12 వార్డుల్లో 10 చొప్పున గెలిచి పార్టీ జయకేతనం ఎగురవేసింది.
అయితే కేసముద్రం, దేవరకద్ర వంటి చోట్ల హంగ్ పరిస్థితి నెలకొంది. కేసముద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 8 వార్డులు గెలిచాయి. తొర్రూరులో బీఆర్ఎస్ విజయం సాధించగా, వడ్డేపల్లిని ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది.
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ బలమైన ప్రదర్శన చేయగా, కొన్ని మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.








