Amaravati Development: అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక సహాయంలో భాగంగా ఇప్పటికే రూ.750 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పరిమళ్ నత్వాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను తెలిపారు.
కేంద్రం అమరావతికి ప్రకటించిన మొత్తం రూ.1,500 కోట్ల ప్రత్యేక సాయంలో సగభాగం ఇప్పటికే విడుదలైందని ఆయన స్పష్టం చేశారు.
అలాగే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB)ల నుంచి రుణాల రూపంలో మరో రూ.5,120 కోట్ల నిధులు అందినట్లు చెప్పారు. ఈ నిధులు మరియు కేంద్రం మంజూరు చేసిన గ్రాంట్ల వినియోగ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తోందని వివరించారు.
అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి అమరావతి అభివృద్ధి కోసం రూ.15,000 కోట్లను సమకూరుస్తామని కేంద్ర బడ్జెట్లో ఇచ్చిన హామీ మేరకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి రూ.7,245 కోట్ల రుణ సహాయం లభించిందని తెలిపారు. ఈ మొత్తం కేంద్రం ప్రకటించిన సహాయంలో 90 శాతానికి సమానమని, మిగిలిన 10 శాతాన్ని ప్రత్యేక గ్రాంట్గా ఏపీకి ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు.
ఇక ఏపీకి కేటాయించిన నానో ఎరువుల సరఫరాపై కూడా రాజ్యసభలో చర్చ జరిగింది. గత మూడు వ్యవసాయ సీజన్లలో కేటాయించిన 56.44 లక్షల బాటిళ్లలో ఇప్పటివరకు కేవలం 42.36 శాతం మాత్రమే సరఫరా జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.
