విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో జరిగిన చందనోత్సవం భక్తులకు విషాదం మిగిల్చింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి అక్కడి ఓ సిమెంట్ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి క్యూలైన్లలో నిలుచుని ఉన్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరు మృతదేహాలు వెలికి తీశారు. శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్టు సమాచారం అందుతోంది. మృతులలో పురుషులు, మహిళలు ఉన్నారు. వర్షపు నీరు చేరి భక్తులు కదలలేని పరిస్థితి ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల తొలగింపు, మరింత ప్రమాదం లేకుండా చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ప్రమాద స్థలంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. భక్తుల భద్రత విషయంలో దేవస్థాన పాలకమండలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాలు అధికారుల పరిశీలనలో తెలియజేయనున్నారు.
