తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ గ్రామపంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తక్షణమే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్ర బాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శ్రీ పద్మావతి బైరాగి పట్టెడ రోడ్డునుండి అవిలాలకు వెళ్లే దారిలో ఉండే రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ బ్రాందీ షాపు ముందు అర్థనగ్న నిరసన చేపట్టారు.
ఈ నిరసనలో పరచూరి రాజేంద్ర బాబు, కత్తి రవి మాట్లాడుతూ, సాయి నగర్ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా నివాసం ఉంటున్నారని తెలిపారు. అలాగే, అక్కడే 50 వేల మందికి పైగా లావాదేవీలు నిర్వహించే ఇండియన్ బ్యాంక్, 60 పడకల హాస్పిటల్, మూడు స్కూల్లు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ప్రాంతంలో మద్యం షాపుకు అనుమతి ఇచ్చే ఎక్సైజ్ అధికారులు ఏ ప్రామాణికాలను అనుసరించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ స్కూల్, కాలేజీ విద్యార్థులు మద్యం తాగేవారి భయాందోళనకు గురవుతున్నారని, మహిళలు బ్యాంకు పనుల కోసం రావాల్సిన దారిలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. మద్యం తాగిన వ్యక్తుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. దీంతో బ్రాందీ షాపు అనుమతిని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ అధికారులను కోరారు.
బ్రాందీ షాపును వెంటనే రద్దు చేయకుంటే స్థానిక ప్రజలను, విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఏ. జయకృష్ణ, ఎం. రామకృష్ణ, తుండు మల్లికార్జున్, నాగరాజు, శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి పూర్ణ, వీరబాబు, మునేశ్వర్, విక్రం, మనీ తదితరులు పాల్గొన్నారు.