ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సెగలు హైదరాబాద్లోని హోటళ్లు, హాస్టళ్లకు తాకింది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడటమే కాకుండా, రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడం సామాన్యుడి టిఫిన్ ప్లేటుపై పెను ప్రభావం చూపుతోంది. ఈ సంక్షోభం కారణంగా నగరంలోని ప్రధాన హోటళ్లు, మెస్లు తమ మెనూలో భారీ మార్పులు చేస్తున్నాయి.
దోశ, పూరి, వడలకు బ్రేక్
హైదరాబాద్ ఐటీ కారిడార్లోని హోటళ్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వండేందుకు ఎక్కువ సమయం తీసుకునే, అలాగే నూనె వినియోగం ఎక్కువగా ఉండే దోశ, పూరి, వడ, చపాతీ వంటి పదార్థాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు టీ, కాఫీలను కూడా మెనూ నుంచి తొలగించారు. గ్యాస్ ఆదా చేసేందుకు వీలుగా తక్కువ సమయంలో తయారయ్యే ఇడ్లీ, ఉప్మా వంటి వాటిని మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు.
హాస్టళ్లు, మెస్ల మూసివేత ముప్పు
నగరంలోని పీజీ హాస్టళ్లు, మెస్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వంట గ్యాస్ కొరత కారణంగా గంటల కొద్దీ వంట చేసే వీలు లేకపోవడంతో, ప్రస్తుతం కేవలం అన్నం, సాంబార్, పప్పు, రసం వంటి ప్రాథమిక ఆహారాన్ని మాత్రమే వడ్డిస్తున్నారు. ఒకవేళ మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడకపోతే, గ్యాస్ సిలిండర్ల నిల్వలు లేక హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం మినహా మరో మార్గం లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.
భగ్గుమంటున్న ధరలు
రవాణా ఛార్జీల పెరుగుదలను సాకుగా చూపుతూ మరికొన్ని హోటళ్లు రేట్లను అమాంతం పెంచేశాయి. ప్రధాన హోటళ్లలో టిఫిన్ ధరలపై రూ. 10 నుండి రూ. 15 వరకు భారం పడింది. ముఖ్యంగా దోశ, పూరి, వడల ధరలు రూ. 15 పెరగగా, ఇడ్లీ, ఉప్మా వంటి వాటిపై కనీసం రూ. 10 పెరిగింది. యుద్ధ మేఘాల వల్ల తలెత్తిన ఈ అవాంతర పరిస్థితులతో అటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇటు సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.






