తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతిచోటా గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు అల్లాడిపోతున్నారు. క్షేత్రస్థాయిలో గ్యాస్ ఏజెన్సీలు కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసుకుందామంటే ఆన్లైన్ సర్వర్లు సహకరించకపోవడం, ఒకవేళ బుకింగ్ పూర్తయినా సకాలంలో డెలివరీ కాకపోవడంతో సామాన్యుల వంటగదిలో మంటలు ఆరిపోతున్నాయి. వారాల తరబడి వేచి చూసినా సిలిండర్లు ఇంటికి రాకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ఉన్న డిమాండ్ను సాకుగా చూపుతూ కొన్ని ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్కు గ్యాస్ను తరలిస్తున్నాయని, దీనివల్ల సాధారణ వినియోగదారులకు సక్రమంగా సేవలు అందడం లేదని తెలుస్తోంది. అధికారులు వెంటనే స్పందించి ఈ గ్యాస్ సంక్షోభాన్ని నివారించాలని, అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






