Rain Alert: తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. నిన్న రాత్రి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో రోడ్లు నీటమునిగాయి. ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. అయితే వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది.
రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అలాగే బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్లో ఉదయం నుంచే నల్లటి మబ్బులు కమ్ముకొని, కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరం లేకపోతే బయటకు వెళ్లకూడదు. నీటితో నిండిన రహదారులు, వంతెనలు దాటకుండా జాగ్రత్త పడాలి. విద్యుత్ తీగలు, పోల్స్ దగ్గరకు వెళ్లరాదు.
ఇళ్ల చుట్టూ నీరు నిల్వ కాకుండా డ్రైనేజీలను శుభ్రం చేయాలి. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. నదులు, వాగులు పొంగే ప్రమాదం ఉన్నందున తీర ప్రాంతాలకు వెళ్లకూడదు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం మంచిది. ప్రజలు ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.








