Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ, తాజా జియోపాలిటికల్ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను మళ్లీ దెబ్బతీశాయి.
లెబనాన్పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించగా, ఇరాన్ హార్మూజ్ జలసంధి మూసివేతతో గ్లోబల్ మార్కెట్లలో ఆందోళన మరింత పెరిగింది.
ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎగసిపడగా, భారత మార్కెట్లపై దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. భారీ లాభాల తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు పెరగడం వల్ల సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 931.25 పాయింట్లు కోల్పోయి 76,631 వద్ద ముగియగా, నిఫ్టీ 222.25 పాయింట్లు పడిపోయి 23,775 వద్ద స్థిరపడింది. రూపాయి కూడా అమెరికా డాలర్తో పోలిస్తే బలహీనపడి 92.54 వద్ద ట్రేడ్ అయింది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, ఎఫ్ఐఐల అమ్మకాలు సమీప కాలంలో మార్కెట్పై ఒత్తిడి కొనసాగించే అవకాశం ఉంది.
అయితే దేశీయంగా ఆర్థిక స్థిరత్వం, కార్పొరేట్ ఫలితాలు, మరియు రంగాలవారీ కొనుగోళ్లు మార్కెట్కు కొంత మద్దతు ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. గురువారం సెషన్లో భారీ ర్యాలీ తర్వాత వచ్చిన ఈ కరెక్షన్, ఇన్వెస్టర్లలో జాగ్రత్త ధోరణిని మరింత పెంచింది.








