Property Tax: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను ఈ నెల 31లోపు చెల్లించే వారికి వడ్డీపై 50 శాతం రాయితీ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక భారం తగ్గనుంది. ఇప్పటికే వడ్డీతో సహా పన్ను చెల్లించిన వారికి కూడా ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. వారు చెల్లించిన అదనపు వడ్డీ మొత్తాన్ని తదుపరి బిల్లులో సర్దుబాటు చేస్తామని స్పష్టం చేసింది.
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఈ మేరకు జీవో నంబర్ 58ను జారీ చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిలను క్లియర్ చేసుకోవాలని ప్రభుత్వం పౌరులకు సూచించింది. ఈ నిర్ణయం ద్వారా నగరాల ఆదాయం పెరగడమే కాకుండా పన్ను చెల్లింపులో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.








