Polavaram Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు జరిగే “2027 జూన్” నాటికి పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పనులు కొనసాగిస్తోంది. 2024లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా నిధులు విడుదల చేయడంతో నిర్మాణ పనులకు ఊపు వచ్చింది.
ప్రస్తుతం పోలవరంలో ప్రధానంగా మిగిలింది “ప్రధాన డ్యాం నిర్మాణం” మాత్రమే. కుడి కాలువ పనులు పూర్తవ్వగా, ఎడమ కాలువ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి కానున్నాయి.
గతంలో కాఫర్ డ్యాంలలో సీపేజీ సమస్యల వల్ల పనులు నిలిచిపోయినా, విదేశీ నిపుణుల సూచనలతో “బట్రస్ డ్యాం నిర్మాణం” పూర్తి చేయడంతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది.
డయాఫ్రం వాల్ విషయంలోనూ కీలక పురోగతి సాధించారు. మొత్తం 1,350 మీటర్లలో ఇప్పటికే 91 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంను గ్యాప్-1, గ్యాప్-2గా రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. గ్యాప్-1 డిజైన్లకు కేంద్ర జలసంఘం ఆమోదం ఇచ్చింది.
పునరావాస పనుల్లోనూ వేగం పెరిగింది. తొలిదశలో తరలించాల్సిన 38,060 కుటుంబాల్లో ఇప్పటికే 16,291 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించారు. మిగిలిన కాలనీల పనులు 2026 డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మొత్తం మీద 2027 పుష్కరాలే(Polavaram Pushkaralu 2027) లక్ష్యంగా పోలవరం పనులు జోరుగా సాగుతున్నాయి.
