Chiranjeevi-Konda Surekha: మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇటీవల జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి సురేఖ, ఆయనకు ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరించారు.
ఈ భేటీకి ఆమె కుమార్తె కొండా సుస్మిత కూడా హాజరయ్యారు. మొత్తం కార్యక్రమం మర్యాదపూర్వకంగానే సాగినప్పటికీ, అసలు చర్చకు కారణం మాత్రం భేటీ అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టే.
ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ కొండా సురేఖ చిరంజీవిని “కేంద్ర మాజీ మంత్రి”గా సంబోధించడంతో రాజకీయంగా కొత్త సందేహాలు మొదలయ్యాయి. ప్రజారాజ్యం పార్టీ స్థాపన, అనంతరం కాంగ్రెస్లో విలీనం, రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం చిరంజీవికి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
అయినప్పటికీ అధికార కాంగ్రెస్కు చెందిన కీలక మంత్రి ఈ విధంగా కలవడం వెనుక ఏమైనా రాజకీయ అర్థాలున్నాయా? లేక ఇది కేవలం వ్యక్తిగత మర్యాద మాత్రమేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నెటిజన్లు తమదైన విశ్లేషణలు చేస్తున్నారు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ఇటీవల కవల పిల్లలు పుట్టిన నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పేందుకే మంత్రి వెళ్లారని కొందరు భావిస్తే, కొండా సుస్మిత చిరంజీవి అభిమానిని కావడంతో ఈ భేటీ జరిగిందని మరికొందరు అంటున్నారు.
రాజకీయాలకు తిరిగి రావడం లేదని చిరంజీవి ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ, ఒక్క భేటీతోనే ఆయన పేరు మళ్లీ రాజకీయ చర్చల్లోకి రావడం మెగాస్టార్ ప్రభావం ఇప్పటికీ తగ్గలేదని సూచిస్తోంది.
