కామారెడ్డి జయశంకర్ కాలనీలోని ఓంకారేశ్వర ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని రెండు రోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మంగళచరణంతో ప్రారంభమైన ఉత్సవాల్లో గంగా పూజ, గౌరీ పూజ, మహాగణపతి పూజ, పరిమళోదక మహాన్నపనం, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలు జరిగాయి.
భిక్కనూరు సిద్ధగిరి సదాశివ మహంత్ శివాచార్య స్వామీజీ దీపారాధన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణం నిర్వహించారు. భక్తుల శ్రేయస్సు కోసం 20 మంది జంటలతో లోక కళ్యాణార్థ హోమం జరిగింది. అనంతరం అవినాష్ పంతులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.
సాయంత్రం కామారెడ్డిలోని ధర్మశాల నుండి జయశంకర్ కాలనీ ఓంకారేశ్వర ఆలయం వరకు వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు కలశాల ఊరేగింపులో పాల్గొన్నారు. పాత బస్టాండ్, పంచముఖి హనుమాన్ ఆలయం మీదుగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి మంగళ స్నానం నిర్వహించారు. భక్తులు “ఓం నమశ్శివాయ” మంత్రోచ్చారణలతో శివుని మహిమను గానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కపిల ప్రభాకర్, మాదంశెట్టి ఆంజనేయులు, పట్నం శెట్టి శ్రీనివాస్, గంజి సంగమేశ్వర్, చేవెళ్ల రాజు, పటేల్ రాజు, జీవన్ దేశాయ్, ఇంద్ర శేఖర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. భక్తుల విశ్వాసంతో ఆలయ ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి.
