వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కడప శివార్లలో సుమారు 52 ఎకరాల భూములను, అటవీ భూములు, ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో వేడి చర్చకు దారితీసింది.
ఈ భూ కబ్జా వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి, పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అటవీ, రెవెన్యూ శాఖలకు సర్వే చేసి నివేదిక అందించాలని సూచించారు. పేదల భూములు అక్రమించేవారికి కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం ఆదేశాల నేపథ్యంలో అటవీ, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. కబ్జాకు సంబంధించిన భూములను పరిశీలించేందుకు సర్వే చేస్తున్నారు. ఈ భూముల్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం గెస్ట్ హౌస్ నిర్మించినట్టు సమాచారం వెలువడుతోంది.
మరోవైపు, భూ కబ్జా ఆరోపణలపై వైసీపీ నేతలు స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఈ వివాదం రాజకీయంగా మరింత ముదురుతుందా? లేదా దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందా? అన్నది చర్చనీయాంశమైంది.







