Drug Operation: హైదరాబాద్లో డ్రగ్స్పై పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ సంచలనం రేపుతోంది. నగర శాంతిభద్రతలను బలోపేతం చేయడం, డ్రగ్స్ రహిత నగరంగా మార్చడం లక్ష్యంగా రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు, మొత్తం 1300 మందిని గుర్తించారు.
తొలి విడతలో 250 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్తో పాటు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఫలితాలు షాకింగ్గా వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఏకంగా 190 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే పరీక్షించిన వారిలో దాదాపు 75 శాతం మంది మత్తు పదార్థాలకు బానిసలైనట్లు తేలింది.
విచారణలో ఎక్కువ మంది రౌడీ షీటర్లు గంజాయి వినియోగానికి అలవాటు పడినట్లు గుర్తించారు. గంజాయి మత్తులోనే వీరు ఘర్షణలు, దాడులు, హత్యలు వంటి నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు.
ఇక డ్రగ్స్ సరఫరా మూలాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నగర శివార్ల నుంచి సరఫరా జరుగుతోందా లేదా పక్క రాష్ట్రాల నుంచి డ్రగ్స్ రాకపోకలు జరుగుతున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఈ నెట్వర్క్కు సహకరిస్తున్న స్థానిక ఏజెంట్లను గుర్తించేందుకు కూడా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
మిగిలిన రౌడీ షీటర్లకు కూడా త్వరలో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా చేస్తున్న చైన్ సిస్టమ్ ను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా పోలీసులు ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ చర్యలతో నగరంలోని అసాంఘిక శక్తుల్లో భయం నెలకొంది.








