Gratuity Rules: ఉద్యోగులకు ఊరట కలిగించేలా గ్రాట్యుటీ నిబంధనల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు సాధారణంగా కనీసం 5 సంవత్సరాల నిరంతర సేవ పూర్తి చేసిన తర్వాతే గ్రాట్యుటీకి అర్హత ఉండేది. అయితే కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చిన తర్వాత, కొన్ని వర్గాల ఉద్యోగులకు కేవలం 1 సంవత్సరం సేవతోనే గ్రాట్యుటీ పొందే అవకాశం కల్పించారు.
అయితే ఈ సౌకర్యం అందరికీ వర్తించదనే విషయం గుర్తుంచుకోవాలి.ఈ మార్పులు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయని కార్మిక చట్టాలపై వెలువడిన వివరణలు చెబుతున్నాయి.
ఈ కొత్త రూల్ ప్రధానంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ (Fixed Term Employees – FTEs) కు వర్తిస్తుంది. అంటే, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు వంటి నిర్దిష్ట కాలానికి కాంట్రాక్ట్పై నియమించబడిన ఉద్యోగులు ఈ కేటగిరీలోకి వస్తారు. వీరికి 5 సంవత్సరాలు పూర్తికాకపోయినా, పని చేసిన కాలానికి అనుగుణంగా ప్రోరాటా పద్ధతిలో గ్రాట్యుటీ చెల్లిస్తారు.
అయితే శాశ్వత ఉద్యోగులకు మాత్రం సాధారణంగా 5 సంవత్సరాల సేవ నిబంధన కొనసాగుతుంది. మరణం, అంగవైకల్యం లేదా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ముగింపు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వేరే నిబంధనలు వర్తిస్తాయి.
ఇక గ్రాట్యుటీ లెక్కింపులో కూడా మరో కీలక మార్పు చోటుచేసుకుంది. కొత్త wage definition ప్రకారం బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ (DA), రిటైనింగ్ అలవెన్స్ కలిపి మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. ఒకవేళ అలవెన్సులు 50% కంటే ఎక్కువైతే, ఆ అదనపు భాగాన్ని కూడా wageలో కలిపి లెక్కిస్తారు.
దీని వల్ల చాలా కంపెనీల్లో గ్రాట్యుటీ, PF, ఇతర స్టాట్యుటరీ బెనిఫిట్స్ మొత్తాలు పెరిగే అవకాశం ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఉద్యోగుల చివరి గ్రాట్యుటీ మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపించవచ్చు.








