FASTag: దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణం మరింత వేగవంతం చేయడానికి కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రణాళిక సిద్ధం చేసింది.
తాజా విధానం ప్రకారం 2026 ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద క్యాష్ చెల్లింపులు ఉండవని, పూర్తిగా డిజిటల్ విధానమే అమలులో ఉంటుందని ప్రకటించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టోల్ వసూళ్లలో సుమారు 98 శాతం ఫాస్టాగ్(FASTag) ద్వారా జరుగుతుండగా, కేవలం 2 శాతం మాత్రమే నగదు లేదా యూపీఐ ద్వారా జరుగుతోంది. ఈ చిన్న శాతం వాహనాలే టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్కు కారణమవుతున్నాయని NHAI గుర్తించింది.
ఇప్పటికే క్యాష్ చెల్లింపులపై రెట్టింపు రుసుము, యూపీఐపై అదనపు ఛార్జీలు విధించినప్పటికీ వేచిచూడాల్సిన సమయం తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నగదు రహిత విధానం అమలుతో ప్రయాణికులకు భారీ ఉపశమనం కలగనుంది. చిల్లర సమస్యలు, రసీదు ఆలస్యం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వాహనాలు టోల్ వద్ద ఆగకుండా వేగంగా ముందుకు సాగుతాయి.
ఇప్పటికే వెయిటింగ్ టైమ్ 734 సెకన్ల నుంచి 47 సెకన్లకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొత్త విధానంతో ఇది మరింత తగ్గే అవకాశం ఉంది.
ఇంకా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రతపై ఫిర్యాదు చేస్తే ఫాస్టాగ్ ఖాతాలో రూ.1000 రివార్డు జమ చేసే విధానం అమలులోకి రానుంది. 2026 చివరికి దేశవ్యాప్తంగా బారియర్-ఫ్రీ టోల్ వ్యవస్థను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందులో కెమెరాలు, జీపీఎస్ ఆధారిత టెక్నాలజీ ద్వారా వాహనాలు ఆగకుండా టోల్ ఆటోమేటిక్గా వసూలు చేయనున్నారు.








