రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అందులో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు.
ధాన్యం సేకరణలో ముందస్తు ఏర్పాట్లపై జిల్లాస్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది.
జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్. శోభిక, పార్వతీపురం,సీతంపేట ఐటిడిఏల ప్రాజెక్ట్ అధికారులు అశుతోశ్ శ్రీవాస్తవ, యశ్వంత్ కుమార్ రెడ్డి లతో కలిసి ధాన్యం సేకరణపై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది రైతులకు అధిక దిగుబడి వచ్చేలా అధికారులు కృషిచేశారని, తద్వారా జిల్లాలో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశం ఉందని అన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కొనుగోలు ప్రక్రియలో అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా పూర్తిచేయాలని తెలిపారు. ధాన్యం సేకరణలో ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన గన్నీ సంచులు, రవాణా ఏర్పాట్లు, కొనుగోలు ప్రక్రియకు అవసరమైన పరికరాలు అన్ని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైతులకు నగదు చెల్లించేందుకు వీలుగా ఖచ్చితత్వంతో కూడిన బ్యాంకు ఖాతాలను రైతుల నుంచి ముందుగా పొందాలని కలెక్టర్ వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించిన ఊరుకోబోమని, మిల్లర్లకు సహకరిస్తామని, అలాగే మిల్లర్లు కూడా రైతులకు సహకరించాలని రైస్ మిల్లర్ల యజమానులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్ పాల్, పౌర సరఫరాల మేనేజర్ మరియు ఇన్ ఛార్జ్ జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాసులు, ఆర్.టి.ఓ ఎం.శశికుమార్, డీసీఓ పి.శ్రీరామమూర్తి, జీసీసీ డివిజనల్ మేనేజర్ వి.మహేంద్రకుమార్, సీతంపేట జీసీసీ కృష్ణ మిలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మిల్లర్ల యజమానులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.