China Military Crisis: చైనాలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి ఒకరు తీవ్రమైన ఆరోపణలతో దర్యాప్తు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అవినీతితో పాటు కీలకమైన అణ్వాయుధాల రహస్యాలను విదేశీ దేశానికి లీక్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం చైనా మిలిటరీలో సంచలనంగా మారింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన జనరల్ జాంగ్ యూక్సియా ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్గా ఉన్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అత్యున్నత స్థాయి అధికారి అయిన ఆయనపై అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలనాత్మక కథనం ప్రచురించింది.
చైనా అణ్వాయుధ ప్రోగ్రామ్కు సంబంధించిన కీలక సాంకేతిక సమాచారాన్ని జాంగ్ అమెరికాకు లీక్ చేశారని ఆ కథనంలో పేర్కొంది.
అంతేకాకుండా, ప్రమోషన్లలో లంచాలు, ఆయుధాల కొనుగోళ్లలో అవినీతి, కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల వంటి ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైనా రక్షణ మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే, ఈ అంశంపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ పరిణామాల అనంతరం చైనా మిలిటరీలో అంతర్గత ఉద్రిక్తతలు పెరిగినట్లు, మరికొందరు సీనియర్ జనరల్స్ను కూడా నిర్బంధించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వీటిని చైనా అధికారులు లేదా పశ్చిమ దేశాల నిఘా సంస్థలు ధ్రువీకరించలేదు.
ALSO READ: తెలంగాణ ఓటర్లకు అలర్ట్…తెలంగాణలో త్వరలో SIR అమలు?
