హేమసుందర్, సీనియర్ నటుడిగా వందల సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన నటనా ప్రయాణం గురించి మాట్లాడారు. “నేను ఏఎన్నార్ గారిని చూసే ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను. నేరుగా ఆయనను కలసి అవకాశాలు అడిగాను. అలా ఆయన సినిమా ‘విచిత్రబంధం’ ద్వారా నా కెరీర్ ప్రారంభమైంది” అని చెప్పారు.
“నటనలో నాకు ఎన్టీఆర్ గారితో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది. ఆయనతో తాత పాత్రలో నటించాను. అది ఎస్వీఆర్ లేదా గుమ్మడివంటి వారు చేయాల్సిన పాత్ర. కానీ ఆ పాత్ర నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఒక సీన్లో రామారావు గారు నా పాదాలపై పడడం అనుకోకుండా జరిగింది. అది మహానటుడిగా ఆయన పాత్రపైనే చూపించిన ప్రతిభ” అని అన్నారు.
“రజనీకాంత్ గారితో నా మంచి స్నేహం ఉంది. ఇద్దరం బాలచందర్ స్కూల్ నుండి వచ్చాం. ఆయన ఇంత పెద్ద స్టార్ అవుతారని నేను ఊహించలేదు. నటుడిగా నాకు దక్కిన గౌరవం పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఈ జర్నీ నాకు చాలా సంతోషాన్నిచ్చింది” అని చెప్పారు.
“నాకు ఇప్పుడు 83 ఏళ్లు. ఆరోగ్యంగా ఉండటం నా అదృష్టం. ఇప్పటికీ నేను టాబ్లెట్ తీసుకోకుండానే ఆరోగ్యంగా ఉన్నాను. నటనలో నా ఆసక్తి ఇంకా తగ్గలేదు. ఏ అవకాశం వచ్చినా నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను” అని హేమసుందర్ తమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.







