TVK Vijay: నీట్ పరీక్ష అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలకు తమిళనాడు CM విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ బహిరంగ మద్దతు ప్రకటించింది. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయకపోతే విద్యార్థుల సమస్యలకు పరిష్కారం దొరకదని పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో, నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులకు సంఘీభావంగా రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతలు చేపట్టిన ఆందోళనలను అభినందించింది.
నిరసనలో పాల్గొన్న నాయకులను అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించింది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు కొనసాగిస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని టీవీకే వెల్లడించింది. వైద్య విద్యను రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పార్టీ అభిప్రాయపడింది. ఒకవేళ చట్టపరమైన అడ్డంకులు ఉంటే, అవి తొలగే వరకు ప్రత్యేక తాత్కాలిక విధానాన్ని అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన అధికారాలు ఇవ్వాలని సూచించింది.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని టీవీకే కోరింది. దేశవ్యాప్తంగా నెలకొన్న అసంతృప్తికి ముగింపు పలకాలంటే నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడమే సరైన మార్గమని పార్టీ మరోసారి స్పష్టం చేసింది.
ALSO READ: NEET | మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా వృథా చేసుకోకండి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు








