Narendra Modi: భారత్-ఇండోనేషియా మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధం కాలంతో మరింత బలపడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. జకార్తాలోని ఇండోనేషియా(Indonesia) పార్లమెంట్ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధాలను ఆయన ప్రస్తావించారు. సముద్ర సరిహద్దులు మాత్రమే కాకుండా వేల ఏళ్ల నాగరికత, సంప్రదాయాలు కూడా ఇరు దేశాలను ఒకే తాటిపై నిలబెట్టాయని అన్నారు.
రామాయణం, మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాల ప్రభావం ఇండోనేషియా సంస్కృతిలో ఇప్పటికీ కనిపిస్తోందని మోడీ గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఇండోనేషియాకు భారత్ అందించిన మద్దతును కూడా ఆయన ప్రస్తావిస్తూ, పరస్పర విశ్వాసమే ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాదిగా నిలిచిందన్నారు. భారత్ అభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుందని, ఇతర దేశాల భూభాగాలపై విస్తరణవాద ఆశలు తమకు లేవని ప్రధాని స్పష్టం చేశారు.
“సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్” అనే సిద్ధాంతంతోనే దేశం పురోగమిస్తోందని పేర్కొన్నారు. రెండు దేశాల రాజధానులు దూరంగా ఉన్నప్పటికీ సముద్రం ద్వారా భౌగోళికంగా చాలా దగ్గరగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రపంచ భద్రతకు ఉగ్రవాదం అతిపెద్ద సవాలుగా మారిందని పేర్కొన్న ప్రధాని, దాన్ని నిర్మూలించేందుకు దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్కు మద్దతు తెలిపిన ఇండోనేషియా ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిఘా సమాచార మార్పిడి, సైబర్ నేరాల నియంత్రణ, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక వనరులను అడ్డుకోవడం వంటి అంశాల్లో భారత్-ఇండోనేషియా కలిసి పనిచేస్తే ప్రాంతీయ భద్రత మరింత బలోపేతం అవుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
ALSO READ: India and Indonesia | బ్రహ్మోస్ నుంచి అస్త్ర వరకు.. భారత్తో కీలక రక్షణ ఒప్పందం








