Jammu and Kashmir: ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్ముకశ్మీర్ అంశంపై భారత్–పాకిస్థాన్ మధ్య మళ్లీ మాటల యుద్ధం జరిగింది. పాకిస్థాన్ ప్రతినిధి జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా, భారత్ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తిరస్కరించింది. ఇది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని భారత్ స్పష్టంగా తెలిపింది.
భద్రతా మండలి వార్షిక నివేదికపై ఐరాస వేదికగా జరిగిన చర్చ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు భారత శాశ్వత ప్రతినిధి పి. హరీశ్ తీవ్రంగా స్పందించారు. జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం భారత్లో విడదీయలేని భాగమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ చేస్తున్న వాదనలకు చారిత్రక ఆధారాలు లేవని, నిరాధార ఆరోపణలతో వాస్తవాలను మార్చలేరని ఆయన మండిపడ్డారు. ఐరాస వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం పాక్ దుర్వినియోగం చేస్తోందని భారత్ ఆరోపించింది.
ఇక మరోవైపు, పాక్ ఆక్రమిత గిల్గిట్-బల్టిస్థాన్లో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై కూడా భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతం పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్నదని, అక్కడ ఎన్నికల ప్రక్రియ మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చేందుకు మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. ఆ ప్రాంతంపై నియంత్రణను తక్షణమే ముగించాలని భారత్ డిమాండ్ చేసింది. అయితే భారత్ వ్యాఖ్యలను పాకిస్థాన్ విదేశాంగ శాఖ తిరస్కరిస్తూ అవి నిరాధార ఆరోపణలని పేర్కొంది. ఈ సంఘటనల తర్వాత ఐక్యరాజ్యసమితిలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.
ALSO READ: Renault Duster 2026 | కొత్త అవతార్లో డస్టర్.. అధిక మైలేజ్తో మార్కెట్లోకి








