CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పూర్తి నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా, అమలు దిశగా కీలక చర్యలు చేపట్టింది.
సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ ప్రకారం, 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తొలి విడతగా రూ.2,000 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విడుదల చేసిన నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన కీలక బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది.
ప్రత్యేకంగా రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను 100 శాతం చెల్లించడంతో పాటు, మే 2025 వరకు పెండింగ్లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా విడుదల చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ.4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.








